Tuesday, January 4, 2022

బత్తిన నరసింహారావు (1945-2017)

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో బత్తిన నరసింహారావు గారు ఒకరు. మాజీఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. వ్యాపార,రాజకీయ ,సామాజిక రంగాల్లో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

బత్తిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బత్తినవారిపల్లె గ్రామంలో బత్తిన రామయ్య, అక్కమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి రామయ్య గారు ఆరోజుల్లోనే ఆర్.ఎస్.ఎస్ సానుభూతిపరులు. ఆర్.ఎస్.ఎస్ శాఖను తమ ఇంట్లో నిర్వహించేందుకు తోడ్పడ్డారు. 
తండ్రి ద్వారా చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్ పట్ల  అభిమానాన్నిపెంచుకున్నారు.

విద్యాభ్యాసం కోసం ఒంగోలు పట్టణంలో నివాసం ఉంటున్న మేనమామ కొండ్ల రామయ్య ఇంటికి చేరి హైస్కూల్ విద్యను ప్రారంభించారు. ఒంగోలులో చదువుతున్న సమయంలోనే ఆర్.ఎస్.ఎస్ శాఖలకు తరచుగా వెళ్లేవారు. ఉన్నత విద్య కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరి అగ్రికల్చర్ బీఎస్సి పూర్తి చేశారు. అనంతరం ఒంగోలు కేంద్రంగా  వ్యాపారరంగంలోకి ప్రవేశించారు.

అలహాబాద్ లో చదువుతున్న సమయంలో నే ఆర్.ఎస్.ఎస్ విద్యార్థి సంఘం ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి ఒంగోలు ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు విస్తరణలో కీలకంగా వ్యవహరించారు.1972లో జైఆంధ్రా, 1975 లో ఎమెర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొన్నారు.ముఖ్యంగా ఎమెర్జెన్సీ సమయంలో వెంకయ్య నాయుడు గారితో కలిసి పనిచేశారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ టిక్కెట్ మీద ఒంగోలు లోక్ సభకు పోటీ చేసిన
వెంకయ్య గారి ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఉదయగిరి నుండి పోటీ చేసిన వెంకయ్య గారి గెలుపునకు కృషిచేశారు.

1980 లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తరవాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  నుండి ఆ పార్టీలో మొదట చేరిన అతి కొద్ది నేతల్లో బత్తిన ఒకరు. ప్రకాశం జిల్లాలో పార్టీ విస్తరణ భాద్యతలతో పాటుగా పార్టీ కార్యక్రమాల కోసం నిధుల సేకరణలో ముందుడేవారు. 1982, 1987లలో వరుసగా రెండు సార్లు ఒంగోలు పురపాలక సంఘానికి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఎల్.కె.అద్వానీ చేపట్టిన రామాజన్మ భూమి రథ యాత్రలో భాగంగా ఒంగోలు లో జరిగిన సభకు జిల్లావ్యాప్తంగా కార్యకర్తలను సమీకరించి సభను విజయవంతం చేయడంతో జాతీయ నేతల దృష్టిలో పడ్డారు.

1991 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ నుండి పోటీ చేసి మరో మారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల యుద్ధంలో ఓటమి పాలైన పార్టీలో మాత్రం ఆయన కీలకమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. మూడు సార్లు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు గా , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా
వంటి పలు కీలకమైన పదవులు నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులతో సన్నిహితుడిగా చివరి వరకు ఉంటూ వచ్చారు.

నరసింహారావు గారు వ్యాపార రంగంలో విజయవంతమైన వ్యక్తి . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ , విజయవాడ వంటి నగరాలకే పరిమితం అయినా ఖరీదైన హోటల్ వ్యాపారాన్ని ఒంగోలు వంటి అభివృద్ధి చెందబోతున్న పట్టణంలో 1980ల్లోనే  అత్యాధునిక వసతులతో కూడిన హోటల్ మౌర్యను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోటలియర్స్ రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా పలుమార్లు పనిచేశారు.

రాజకీయాలు, వ్యాపార రంగాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో విద్యారంగం అభివృద్ధి కి కూడా కృషి చేశారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారకార్థం ఒంగోలు పట్టణంలో 1987లో ఆంధ్ర కేసరి విద్య సంస్థను ప్రారంభించారు. సంస్థ లో తొలుత జూనియర్ ఇంటర్మీడియట్ తో ప్రారంభించి నేడు ఇంటర్మీడియట్, డిగ్రీ, లా మరియు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. నేడు  నిరుపేద విద్యార్థులకు ఈ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది .

బత్తిన నరసింహారావు గారి భార్య పేరు వసుంధర దేవి, వీరి కుమారులు మహేష్ ,రాజేష్ గార్లు డాక్టర్స్ , కుమార్తె దేవసేన గృహిణి. 

సుమారు 50 సంవత్సరాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో తను నమ్మిన సిద్దాంతలకు కట్టుబడిన వ్యక్తి బత్తిన నరసింహారావు గారు.  



No comments:

Post a Comment

గొట్టిపాటి హనుమంతరావు (1944-1997)

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్తగా పేరు గడించిన మాజీ మంత్రి వర్యులు, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు స్...