Saturday, April 29, 2023

గొట్టిపాటి హనుమంతరావు (1944-1997)

 



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్తగా పేరు గడించిన మాజీ మంత్రి వర్యులు, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు స్వాతంత్రానికి పూర్వం అవిభక్త గుంటూరు జిల్లాలోని మార్టూరు తాలూకా యద్దనపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.

హనుమంతరావు గారు ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేసిన తర్వాత కుటుంబ పరిస్థితులు కారణంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేక అక్కడితో చదువుకు స్వస్తిపలికి  రైతుగా జీవితాన్ని ప్రారంభించారు.

రైతుగా ఉంటూనే రైస్ మిల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి అనేక రంగాల్లోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరించి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచారు.

హనుమంతరావు గారు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లో అడుపెట్టి యద్దనపూడి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతర కాలంలోనే మార్టూరు భూ తనఖా బ్యాంకు ఛైర్మన్ గా, సంతమాగులురు సమితి అధ్యక్షుడుగా పనిచేశారు.

సమితి అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే 1982 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపునందుకొని ఆ పార్టీలో చేరిన గొట్టిపాటి 1983 ఎన్నికల్లో మార్టూరు నుండి పోటి చేసి తోలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .అయితే కొద్దీ నెలల్లోనే వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మార్టూరు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి బలరాం నియంతృత్వ పోకడలతో నియోజకవర్గంలో వీరి అనుచరులను ఇబ్బందులకు గురి చేయడంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా అధిష్టానంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నాయకులు తమ స్నేహితుడు బలరాంకు వత్తాసు పలకడంతో మనస్తాపం చెందిన వీరు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టూరు నుండి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం చేతిలో ఓటమి చవిచూసినా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ కార్యక్రమాల్లో చూరుగ్గా పాల్గొన్నారు. అయితే కేసుల మాఫీ కోసం తన పూర్వ రాజకీయ గురువు, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో 1993 లో తన రాజకీయ ప్రత్యర్ధి బలరాం కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు.

బలరాం పార్టీకి చేసిన నమ్మక ద్రోహాన్ని క్షమించని పార్టీ అధినేత ఎన్టీఆర్ హనుమంతరావు గారిని పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పార్టీ లోని కొందరు నాయకులు పార్టీలోకి ఆయన్ని రానీయకుండా చేయడంలో విజయం సాధించారు. అయితే ఎన్టీఆర్ గారే స్వయంగా 1994 ఎన్నికల్లో మార్టూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గొట్టిపాటి గారికి పార్టీ తరపున మద్దతు ఇవ్వడంతో ఆయన రెండో సారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన వెంటనే ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు.

1995-97 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

హనుమంతరావు గారు గొప్ప పరిపాలనా దక్షులు తాను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా పూర్తి స్ధాయిలో ప్రజా అభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా సంతమాగులూరు సమితి అధ్యక్షుడుగా సమితి పరిధిలోని అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఆ శాఖలోని అవినీతిని అరికట్టడంలో విజయం సాధించారు.

హనుమంతరావు గారిది విలక్షణమైన వ్యక్తిత్వం, కేవలం మాట పట్టింపు చేత ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తృణ ప్రాయంగా త్యజించిన ఆత్మాభిమానం గల మనిషి. చివరి శ్వాస వరకు అవినీతి అక్రమాలకు ఆమడ దూరంగా ఉంటూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు.

హనుమంతరావు గారు రైతు పక్షపాతి, స్వతహాగా రైతైన వీరు రైతుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. తను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా రైతన్నల సంక్షేమం కోసం పాటుపడ్డారు. తూర్పు ప్రకాశం ప్రాంతం ( మార్టూరు (రద్దయిన నియోజకవర్గం), అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు)లో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేసి రైతన్నల అభిమానాన్ని చూరగొన్నారు.

హనుమంతరావు గారు విద్యారంగంలో తనవంతు కృషి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేని కారణంగా తాను చదవకపోయినా తన సోదరుడు శేషగిరి రావును ఎంబీబీఎస్ మరియు మిగిలిన కుటుంబ సభ్యులను ఉన్నత చదువులు చదివించారు. అంతేకాకుండా అనేక మంది నిరుపేద కుటుంబాలను చెందిన విద్యార్ధులకు, తమ వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు.

హనుమంతరావు గారి రాజకీయ ఎదుగుదలలో ఆయన తమ్ముడు శేషగిరిరావు గారిది కీలకమైన పాత్ర, తన సోదరుడి కోసం సుదీర్ఘ కాలం తెరవెనుక రాజకీయాల్లో పనిచేస్తూనే కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాలను చూసుకునేవారు. హనుమంతరావు గారి కుమారుడు గొట్టిపాటి నరసయ్య సైతం మార్టూరు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. శేషగిరి రావు గారి కుమారుడు ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హనుమంతరావు గారి రాజకీయ వారసుడిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

హనుమంతరావు గారు రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నా వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. బలరాంతో ఏర్పడ్డ రాజకీయ వైరం తర్వాత కాలంలో వ్యక్తిగత వైరంగా మారి ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలోనే తన రాజకీయ వారసుడు, చిన్న కుమారుడు గొట్టిపాటి కిశోర్ బాబు హత్య ఆయన్ని మానసికంగా కృంగి పోయేలా చేసింది. కుమారుడితో పాటు తనను నమ్ముకున్న వందల మంది అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రత్యర్థులు యద్దనపూడిలోని తమ రైస్ మిల్లులో అమర్చిన బాంబు పేలడంతో తన కూడి భుజం, తన తమ్ముడైన శేషగిరిరావు గారి మరణం ఆయన్ని మానసికంగా మరింత కృంగి కృశించేలా చేసింది, తన కళ్ల ముందే తనవారు చనిపోవడం భరించలేక కొద్దీ నెలల్లోనే 53 ఏళ్ల వయస్సులో ఆయన కాలం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో రాజకీయ గొడవల్లో అత్యంత నష్టపోయిన కుటుంబంగా వీరి కుటుంబం నిలిచింది.

కానీ హనుమంతరావు గారి వర్గానికి చెందిన వారి మరణాలకు కారణమైన ప్రత్యర్ధికి మాత్రం పలు సందర్భాల్లో ఆనాటి రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు అండగా నిలవడం గమనార్హం.

సామాన్య రైతు నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన హనుమంతరావు గారి జీవితాన్ని రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునే నేటి యువతరం అధ్యయనం చేయడం చాలా అవసరం.

No comments:

Post a Comment

గొట్టిపాటి హనుమంతరావు (1944-1997)

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్తగా పేరు గడించిన మాజీ మంత్రి వర్యులు, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు స్...